•102 ఏళ్ల దీర్ఘాయుష్కుడు కనికి భూమయ్య మృతి
•ఐదు తరాలకు మార్గదర్శిగా నిలిచిన మహోన్నత జీవితం
సిద్దిపేటజిల్లా. దుబ్బాకనియోజకవర్గం.మనప్రజాప్రతినిధి//జనవరి25
సిద్దిపేట జిల్లా అక్బర్పేట్–భూంపల్లి మండలంలోని అల్మస్పూర్ గ్రామంలో శనివారం శతాధిక వృద్ధుడు కనికి భూమయ్య (102) ప్రశాంతంగా కన్నుమూశారు. ఎలాంటి దీర్ఘకాలిక అనారోగ్యసమస్యలు లేకుండా, వయోభారమే కారణంగా గత కొంతకాలంగా శరీరం సహకరించకపోవడంతో స్వగృహంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మీరపురం పద్మ మల్లేశం మాట్లాడుతూ, కనికి భూమయ్య జీవనశైలి నేటి యువతకు, రాబోయే తరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు. ఇద్దరు సంతానానికి జన్మనిచ్చి,ఐదు తరాలుగా విస్తరించిన పెద్ద కుటుంబానికి మూల పురుషుడిగా ఆయన నిలిచారని తెలిపారు.చివరి శ్వాస వరకు ఎలాంటి ప్రాణాంతక వ్యాధులు ఆయనను దరిచేరలేదని గ్రామస్తులు తెలిపారు. రాగి ముద్ద, జొన్న రొట్టె, అంబలి, పాలు, పెరుగు వంటి సంప్రదాయ ఆహారంతోనే ఆయన దీర్ఘాయుష్కు సాధించారని అన్నారు. సాధారణ జీవనం, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా శతాధిక సంవత్సరాలు జీవించి ఈ తరానికి ఆదర్శంగా నిలిచిన కనికి భూమయ్య మరణం అల్మస్పూర్ గ్రామాన్ని శోకసంద్రంలో ముంచింది.