•మహిళా భవనాన్ని సందర్శించిన కాంగ్రెస్ నేతలు
•శిథిలావస్థలోని భవనంపై పీసీసీ–ఏఐసీసీకి నివేదిక… త్వరలో నూతన నిర్మాణానికి చర్యలు
మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి నియోజకవర్గం.జనవరి24
ఏఐసీసీ, పీసీసీ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆస్తుల పరిరక్షణ చర్యల్లో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ మహిళా భవనాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు.
తిరుపతి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బాలగురవం బాబు అధ్యక్షతన, శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ లీగల్, హ్యూమన్ రైట్స్, ఆర్టీఐ విభాగం అధ్యక్షులు వడ్డీ సోమశేఖర్ మహిళా భవనాన్ని పరిశీలించి, భవన పరిస్థితిపై పీసీసీ, ఏఐసీసీకి సమగ్ర నివేదిక సమర్పిస్తామని, అత్యంత త్వరలో భవన నిర్మాణం చేపట్టేలా చర్యలుతీసుకుంటామని తెలిపారు.
డీసీసీ అధ్యక్షులు బాలగురవం బాబు మాట్లాడుతూ,
భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ఆ నాటి నుంచి దేశవ్యాప్తంగా పార్టీకి విలువైన ఆస్తులు ఉన్నాయని గుర్తు చేశారు. వాటి పరిరక్షణ నిమిత్తం కాంగ్రెస్ పార్టీ పటిష్ట చర్యలు చేపట్టిందని, రాబోయే రోజుల్లో పార్టీ ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా కాపాడుకుంటామని స్పష్టం చేశారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ,పీఆర్ మాధవరావు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్న సమయంలో ఇందిరా ప్రియదర్శిని భవనాన్ని పార్టీ కార్యకలాపాల కోసం వాడుకలోకి తీసుకువచ్చారని, దానికి సుమారు 46 సంవత్సరాలు పూర్తయ్యాయని తెలిపారు. నేడు ఆ భవనం శిథిలావస్థకు చేరుకుందని, అదే స్థలంలో భవిష్యత్తులో నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించి వాడుకలోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు జ్యోతిశ్వర్ నాయక్, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, రేణిగుంట మండల అధ్యక్షులు రాహుల్ రాయల్, శ్రీకాళహస్తి పట్టణ యువజన అధ్యక్షులు ఆంటోనీతో పాటు కృష్ణా, గిరీష్, దిలీప్, నాగరాజు, అరుణ్, మహేష్, బద్రి, మాస్ తదితరులు పాల్గొన్నారు.