మనప్రజాప్రతినిధి
రాజన్న సిరిసిల్ల
జనవరి, 08
స్థానిక జ్యోతినగర్లోని చారిత్రాత్మక హనుమాన్ దేవాలయం వెనుక భాగంలో నిర్మిస్తున్న మురుగు కాలువ వివాదాస్పదంగా మారింది. ఆలయ గోడను ఆనుకొని, ఊరిలోని మురికి నీరంతా దేవాలయం పక్కనుంచే వెళ్లేలా అధికారులు చేపట్టిన ఈ నిర్మాణాలపై భక్తులు మరియు స్థానిక ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
గత 40 ఏళ్లుగా ఉన్న పాత కాలువను వదిలేసి, ఇప్పుడు కావాలనే దేవాలయానికి ఆనుకొని మురుగు కాలువను నిర్మించడం ఆలయ పవిత్రతను దెబ్బతీయడమేనని భక్తులు ఆరోపిస్తున్నారు.
హిందువుల మనోభావాలను గాయపరిచేలా ఈ నిర్మాణాలు చేపట్టడం వెనుక కుట్ర దాగి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాత మార్గంలోనే నిర్మించాలి
40 ఏళ్లుగా మురుగు నీరు వెళ్తున్న పాత మార్గంలోనే కాలువను నిర్మించాలని, దేవాలయం గోడకు ఆనుకొని ఉన్న కొత్త నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ సమస్యపై చంద్రంపేట ప్రజలు ఇప్పటికే మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఆలయ ప్రాంగణంలో అశుభ్రత పెరగకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వెంటనే ఈ కాలువ పనులను మూసివేయాలని కోరారు. అధికారులు స్పందించి పాత కాలువ మార్గాన్నే పునరుద్ధరించాలని, లేనిపక్షంలో నిరసనలు ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.