•పిచ్చి మొక్కల చాటున ‘కొలనూరు’ గ్రామ బోర్డు
వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్లజనవరి,2
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని కొలనూరు గ్రామ సరిహద్దు బోర్డు నిర్వహణ లోపంతో పిచ్చి మొక్కల మధ్య పూర్తిగా దాగిపోయింది. సిరిసిల్ల–కోనరావుపేట ప్రధాన రహదారిపై ఉన్న ఈ బోర్డు చుట్టూ చెట్లు, పొదలు విస్తరించడంతో ప్రయాణికులకు బోర్డు కనిపించక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ముఖ్యంగా కొత్తగా వచ్చే వారు గ్రామంలోకి ప్రవేశించిన విషయం తెలియక తికమక పడుతు న్నారని స్థానికులు తెలిపారు. రాత్రి వేళల్లో అయితే బోర్డు పూర్తిగా కనిపించకపోవడంతో వాహనదారులు కొలనూరు గ్రామాన్ని దాటి ముందుకు వెళ్లిపోతున్నారని వాపోతున్నారు.బంధువులను కలవడానికి, అత్యవసర పనుల నిమిత్తం వచ్చే వారు ఈ సమస్య వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి బోర్డుకు అడ్డంగా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని కోరుతున్నారు. అలాగే రాత్రి సమయంలో కూడా స్పష్టంగా కనిపించేలా రేడియం స్టిక్కర్లు కలిగిన కొత్త గ్రామ బోర్డును ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.