manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 28 January 2026, 7:54 am Posted by : Mana Praja Prathinidhi

పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని అమలు చేయాలి-డీటీఎఫ్ రాష్ట్రఉపాధ్యక్షులు వైద్యుల రాజిరెడ్డి డిమాండ్

టెట్ నిబంధనల సవరణ,డీఏ ఎరియర్స్ విడుదల చేయాలని డిమాండ్
•ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలపై డీటీఎఫ్ కార్యవర్గ సమావేశం
2011కు ముందు నియామకాలకు టెట్ మినహాయింపు ఇవ్వాలి

మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల,జనవరి28
ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం చేయకుండా వెంటనే పీఆర్సీ నివేదికను తెప్పించుకుని అమలు చేయాలని డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వైద్యుల రాజిరెడ్డి డిమాండ్ చేశారు.మంగళవారం సాయంత్రం సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డీటీఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు ఆవురం సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజిరెడ్డి మాట్లాడుతూ పీఆర్సీ అమలులో జరుగుతున్న జాప్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.పీఆర్సీ గడువు ముగిసి రెండేళ్లు దాటినా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఉపాధ్యాయులు, ఉద్యోగులు తీవ్ర ఆర్థిక నష్టానికి గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నివేదికను పరిశీలించి సముచితమైన ఫిట్‌మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తున్న టెట్ నిబంధనలపై కూడా స్పందించిన ఆయన, 20 ఏళ్లకు పైగా సేవలున్న ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేయడం అన్యాయమని అన్నారు. 2011 కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు బూర సదానందం మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న డీఏ (DA) ఎరియర్స్‌ను వెంటనే విడుదల చేయాలని, పదోన్నతుల వల్ల ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు కొత్త డీఎస్సీ (DSC) నిర్వహించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ తిరుపతి, రాష్ట్ర కౌన్సిలర్ దొంతుల శ్రీహరి, జిల్లా కమిటీ సభ్యులు సురేష్, విష్ణు, ఎల్లయ్య, సత్యనారాయణతో పాటు వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్ బాధ్యులు పాల్గొన్నారు.