•నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం
గుంటూరు,జనవరి4(మనప్రజాప్రతినిధి):
నగరంలోని బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ విస్తరణ పనులు నిర్దేశిత ప్రణాళిక ప్రకారం వేగంగా పూర్తి చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్డును పరిశీలించి, జరుగుతున్న విస్తరణ పనుల పురోగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో పాటు నిర్ణీత గడువులో పూర్తిచేయడం అత్యంత ముఖ్యమన్నారు. పనులలో జాప్యం వల్ల ప్రజల రాకపోకలకు, చుట్టుపక్కల నివాసితులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని సూచించారు. ప్రతి పనికి సంబంధించి కార్యదర్శులు, అధికారులు పూర్తి బాధ్యత తీసుకుని నిర్ణీత కాలవ్యవధిలో పనులు పూర్తి చేయాలన్నారు.రోడ్ విస్తరణ జరుగుతున్న క్రమంలోనే రోడ్ నిర్మాణం, డ్రైనేజ్ పనులను కూడా సమాంతరంగా చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. అలాగే విస్తరణ వల్ల ప్రభావితమయ్యే భవనాల తొలగింపు సమయంలో ట్రాఫిక్కు, పరిసర ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో డీఈఈ వెంకటరమణతో పాటు పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.