మనప్రజాప్రతినిధి// సంగారెడ్డి జనవరి 28:
సంగారెడ్డి జిల్లా మీసేవా నిర్వాహకులు తప్పనిసరిగా నియమ నిబంధనలను పాటించాలని ఈడీఎం ఉదయ్ కుమార్ సూచించారు. బుధవారం టీఎస్టీఎస్ జిల్లా మేనేజర్ ప్రదీప్ కుమార్తో కలిసి సంగారెడ్డి జిల్లా మీసేవా నిర్వహకులతో గూగుల్ మీట్ ద్వారా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఉదయ్ కుమార్ మాట్లాడుతూ, నియమ నిబంధనలకు అనుగుణంగానే మీసేవా కేంద్రాలను కొనసాగించాలని స్పష్టం చేశారు. కుల, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాల దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించి, ఎలాంటి తప్పులు లేకుండా దరఖాస్తులు చేయాలని సూచించారు. మీసేవా కేంద్రాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, ముఖ్యంగా మంచినీరు, కూర్చునే కుర్చీలు ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే మీసేవా కేంద్రాల ప్రధాన లక్ష్యమన్నారు.