manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 05 January 2026, 2:38 pm Posted by : Mana Praja Prathinidhi

పాలితులు పాలకులుగా మారిన సర్పంచులు గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి – బక్కీ వెంకటయ్య

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్య
సిద్దిపేటనియోజకవర్గం.జనవరి4{మనప్రజాప్రతినిధి}
భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా పాలితులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గాలు పాలకులుగా మారిన ఈ తరుణంలో గ్రామాలను ఆదర్శంగా మార్చాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్య అన్నారు.దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం సిద్దిపేట ఎంపీడీఓ కార్యాలయంలో సిద్దిపేట జిల్లాలోని ఎస్సీ, ఎస్టీసర్పంచులు, ఉపసర్పంచులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బక్కీ వెంకటయ్య మాట్లాడుతూ, గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని సూచించారు.
పదవిని బాధ్యతగా భావించి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పార్టీలకు అతీతంగా నిధులు సమీకరించి గ్రామ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిమిత నిధులున్న పరిస్థితుల్లో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు.రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలందించి పాలకులుగా గుర్తింపు పొందాలని తెలిపారు. గ్రామాల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు పార్టీలకు అతీతంగా పనిచేసి ఐక్యతను పెంపొందించాలని, కుల, మత భేదాలకు అతీతంగా సేవలందించాలని కోరారు. గ్రామాల్లోని పిల్లలకు ఉన్నత విద్య అందేలా కృషి చేయాలన్నారు.
ఈ సందర్భంగా ఇర్కోడ్ గ్రామ సర్పంచ్ గణపురం కృష్ణను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్య శాలువాతో ఘనంగా సన్మానించారు. గ్రామ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు లో చురుకైన పాత్ర పోషిస్తూ ప్రజల మన్ననలు పొందాలని సర్పంచ్‌గా గణపురం కృష్ణను ప్రత్యేకంగా అభినందించారు. అంబేద్కర్ ఆశయాలను గ్రామస్థాయిలో అమలు చేయడంలో ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇర్కోడ్ గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. శంకర్, ప్రతినిధులు మెట్ల శంకర్, ఎగొండ స్వామి, భీమ్ ధేఖర్, పొతరాజు శంకర్, తిరుపతి, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దేవి రవీందర్, తిమ్మాపూర్ సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్, బ్యాగరి వేణు, సుల్తానా, పుట్ట రాజు, రాంచంద్రం తదితరులు పాల్గొన్నారు.