manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 04 January 2026, 1:16 pm Editor : Mana Praja Prathinidhi

ఓటరు లిస్ట్ డ్రాఫ్ట్‌లో భారీ తప్పులు

క్షేత్రస్థాయిలో పరిశీలించి సవరించాలి:మామిండ్లఆంజనేయులు
మెదక్,జనవరి2(మనప్రజాప్రతినిధి):
మెదక్ పట్టణంలో రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీ కార్యాలయం విడుదల చేసిన ఓటరు లిస్ట్ డ్రాఫ్ట్‌లో అనేక తీవ్ర లోపాలు ఉన్నాయని బీఆర్ఎస్ పట్టణ కన్వీనర్, మాజీ కౌన్సిలర్ మామిండ్ల ఆంజనేయులు ఆరోపించారు.ఒక వార్డుకు చెందిన ఓటర్లు మరో వార్డులో నమోదు కావడం, ఒకే కుటుంబానికి చెందిన ఓట్లు రెండు వేర్వేరు వార్డుల ఓటరు జాబితాల్లో విభజించబ డటం వంటి అనేక తప్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. ముఖ్యంగా 2020 మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అమలులో ఉన్న ఓటరు లిస్ట్‌ను పరిగణలోకి తీసుకోకుండా ప్రస్తుత ఓటరు జాబితాను రూపొందించడం వల్ల ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారని అన్నారు.తేదీ 02.01.2026 న మున్సిపాలిటీ నోటీస్ బోర్డులో ప్రదర్శించిన ఓటరు లిస్టులో ఇంటి నంబర్లు తప్పుగా చూపించడంతో పాటు, గత ఎన్నికల్లో ఒక వార్డులో ఉన్న ఓట్లు ప్రస్తుతం వేరే వార్డుల ఓటరు లిస్టుల్లో కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల ఓటర్ల హక్కులు హరించబడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించిన ఆయన, కార్యాలయ స్థాయిలో కాకుండా మున్సిపాలిటీ సిబ్బంది, అధికారులు క్షేత్రస్థాయిలో డోర్ టు డోర్ పర్యటించి, 2020 ఓటరు లిస్ట్, వార్డుల విభజన, ఇంటి నంబర్ల ఆధారంగా ప్రస్తుత ఓటరు జాబితాను పూర్తిగా పరిశీలించి సవరించాలని డిమాండ్ చేశారు.
తక్షణమే చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు.