manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 05 January 2026, 2:56 pm Editor : Mana Praja Prathinidhi

ఇంటర్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత అవసరం

సీనియారిటీ ప్రాతిపదికన విధులు కేటాయించాలి : జీజేఎల్ఏ
సిద్దిపేటనియోజకవర్గం(మనప్రజాప్రతినిధి):జనవరి5
ఇంటర్మీడియట్ వార్షిక ప్రాక్టికల్, థియరీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం అధ్యాపకులకు పరీక్షల విధులను సీనియారిటీ ఆధారంగా కేటాయించాలని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం (జీజేఎల్ఏ) జిల్లా అధ్యక్షుడు ఏడబోయిన సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.ఈ మేరకు సోమవారం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ) రవీందర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం డీఐఈఓను సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వార్షిక పరీక్షలు సజావుగా జరిగేలా తమ సంఘం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పరీక్షల నిర్వహణకు అవసరమైన అనుకూల వాతావరణాన్ని కల్పించడంలో సంఘ సభ్యులు అధికారులతో సమన్వయంగా పనిచేస్తారని తెలిపారు.
తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన డీఐఈఓ రవీందర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీజేఎల్ఏ జిల్లా ప్రధాన కార్యదర్శి అమరేందర్ రెడ్డి, నాయకులు దేవయ్య, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.