manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 9:21 am Editor : Mana Praja Prathinidhi

కొలనూర్ దుర్గమ్మ ఆలయం సమీపంలో వైన్ షాప్‌కు వ్యతిరేకంగా గ్రామస్తుల ఆందోళన

•ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్లజిల్లా.జనవరి12
కొనరావుపేట మండలంలోని కొలనూర్ గ్రామంలో ఉన్న గ్రామ దేవత శ్రీ దుర్గమ్మ ఆలయ పవిత్రతను కాపాడాలని కోరుతూ గ్రామస్తులు సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.గ్రామ శివారులోని ఎస్సీ కాలనీ వద్ద ఉన్న దుర్గమ్మ ఆలయానికి అతి సమీపంలో ఇటీవల టెండర్ దక్కించుకున్న వైన్ షాప్ నిర్వాహకులు మద్యం దుకాణం ఏర్పాటు కోసం గదుల నిర్మాణ పనులు చేపడుతున్నారని గ్రామస్తులు ఆందోళ న వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఆలయ పరిసరాల్లో మద్యం షాప్ ఏర్పాటు చేయడం అనుచితమని, ఇది ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తుందని వారు తెలిపారు.
నిత్యం పూజలు, ప్రత్యేక కార్యక్రమాలతో కళకళలాడే దుర్గమ్మ ఆలయం వద్ద వైన్ షాప్ ప్రారంభమైతే భక్తులకు, ముఖ్యంగా మహిళలకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు. దీంతో పాటు సామాజిక అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
అందువల్ల ఆలయ సమీపంలో ఏర్పాటు చేయనున్న వైన్ షాప్‌కు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని లేదా ప్రత్యామ్నాయ ప్రాంతానికి తరలించాలని జిల్లా అధికారులను గ్రామస్తులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మెరుగు చందు, ఎర్ర ఆంజనేయులు, పల్లె వినోద్, పల్లె పరమేశ్వర్, మెరుగు వెంకటేష్‌తో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. తమ వినతిని సానుకూలంగా పరిశీలించి న్యాయం చేయాలని వారు జిల్లా అధికారులను కోరారు.