manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 18 January 2026, 1:53 pm Posted by : Mana Praja Prathinidhi

ఉద్యమ కళాకారుల హక్కుల కోసం కాంగ్రెస్‌ను నిలదీయాలి: బొల్లం రాజేష్

ఎన్నికల హామీలను విస్మరించిన రేవంత్ ప్రభుత్వం-ఈనెల 20నహైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఉద్యమకళాకారుల పోరుదీక్ష
సిద్దిపేట,జనవరి18(మనప్రజాప్రతినిధి):
తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఉద్యమ కళాకారుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు బొల్లం రాజేష్ తీవ్ర విమర్శలు చేశారు.ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఉద్యమ కళాకారులు తమ హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. తెలంగాణ అస్థిత్వాన్ని పల్లె నుంచి ఢిల్లీ వరకు చాటిచెప్పిన ఘనత ఉద్యమకళాకారులదేనని ఆయన గుర్తు చేశారు.కానీ కొంతమంది స్వార్థపరులు ఉద్యమ కళాకారుల సంఘాల పేరుతో రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారి అమాయక కళాకారుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఉద్యమ కళాకారులు అహర్నిశలు శ్రమించినప్పటికీ, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం వారిని పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.నాడు కాంగ్రెస్‌ను వ్యతిరేకించినందువల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని, నేడు కూడా ఉద్యమ కళాకారుల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందని బొల్లం రాజేష్ స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఆ అంశాన్ని ప్రస్తావించకపోవడం బాధాకరమని విమర్శించారు.ప్రభుత్వ మంత్రుల ను, ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ ప్రశ్నించాలని ఉద్యమ కళాకారు లకు పిలుపునిచ్చారు. ఉద్యమ కళాకారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఉద్యమ కళాకారుల పోరుదీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యమ కళాకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ పోరుదీక్షను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనకపోతే భవిష్యత్తులో ఉద్యమ కళాకారులు రాజకీయ పార్టీల వద్ద భిక్షాటన చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు.