manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 04 February 2026, 4:20 pm Editor : Mana Praja Prathinidhi

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

•అమరావతిలో ముఖ్యమంత్రిని కలసి ఆహ్వాన పత్రిక అందజేసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తినియోజకవర్గం.ఫిబ్రవరి4
శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు.అమరావతిలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఫిబ్రవరి 10 నుంచి 23 వరకు అత్యంత అంగరంగ వైభవంగా జరగనున్న శ్రీకాళహస్తీశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి కృపాకటాక్షాలు పొంది, ఈ లోకకళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మనస్ఫూర్తిగా కోరారు.
దీనికి స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ,శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం రాష్ట్రంలో నెంబర్ వన్ ఆలయంగా నిలవడంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కృషి ప్రశంసనీయమని ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించి భక్తులకు స్వామివారి కృపాకటాక్షాలు అందేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.అలాగే ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, వాయులింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి ప్రగతిపై సీఎం చంద్రబాబు నాయుడు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన పలు సూచనలు చేస్తూ, ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.శ్రీకాళహస్తి ఆలయం రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవడం పట్ల మరోసారి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని అభినందించిన ముఖ్యమంత్రి, భవిష్యత్తులో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి తీర్థప్రసాదాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అందజేసి, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తప్పక హాజరు కావాలని కోరారు.