•నిందితులకు కఠిన శిక్షలు విధించాలి – మాజీ ఉపసర్పంచ్ తోయేటి శ్రీనివాస్
మనప్రజాప్రతినిధి//పులిమామిడి.చేగుంటమండలం.ఫిబ్రవరీ25
కుమ్మెర గ్రామంలో జరిగిన అమానుష ఘటనలో రెండు నెలల పసిపాప మృతి చెందడం దారుణమని మాజీ ఉపసర్పంచ్ తోయేటి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు కారణమైన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
గ్రామంలో నిర్వహించిన మల్లన్న జాతర సందర్భంగా రజక వృత్తికి చెందిన గణేశ్, ఆయన భార్య మౌనిక తమ రెండు నెలల పసిపాపతో కలిసి జాతరలో పాల్గొన్నారని తెలిపారు. ఈ క్రమంలోచోటుచేసుకున్న వాగ్వాదం కులవివక్షకు దారి తీసి, కొందరు వ్యక్తులు ఆ కుటుంబంపై దాడి చేసినట్లు ఆరోపించారు. ఆ దాడిలో పసిపాప మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.పసిబిడ్డ ప్రాణం తీసేంత క్రూరత్వం సమాజంలో పెరుగుతుండటం ఆందోళనకరమని, ఇది కేవలం ఒక కుటుంబంపై దాడి మాత్రమే కాకుండా బీసీ సమాజ గౌరవంపై జరిగిన దాడిగా భావించాలన్నారు. ఘటనలో నిందితులపై కఠినమైన కేసులు నమోదు చేయకుండా, తేలికపాటి సెక్షన్లతో కేసులు నమోదు చేసి వారిని రక్షించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ధ్వజమెత్తారు.ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించడంతో పాటు, వారికి పూర్తి భద్రత కల్పించాలని తోయేటి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.