– వ్యవసాయ కార్మిక సంఘంరాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.నర్సిములు పిలుపు
సదాశివపేట,ఫిబ్రవరి5(మనప్రజాప్రతినిధి)
కేంద్ర ప్రభుత్వం కార్మిక-కర్షక హక్కులను తొలగిస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా విధానాలు అమలు చేస్తున్నదని, ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. నర్సిములు పిలుపునిచ్చారు.సదాశివపేట మండలం మద్దికుంట గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించి న అనంతరం ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు, కర్షకులపై ఆర్థిక భారం పెంచుతూ కార్పొరేట్ సంస్థలకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల రుణ మాఫీలు చేసి, మరోవైపు ప్రజలపై ధరల పెరుగుదల, పన్నుల భారాన్ని మోపుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.కార్మికులకు రక్షణగా ఉన్న 29 కార్మిక చట్టాలను మారుస్తూ యాజమాన్యాలకు అనుకూలం గా నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో కార్మికులకు 125 రోజుల పనిదినాలు కల్పించేందుకు కనీసం రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాల్సి ఉండగా, కేవలం రూ.95 వేల కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు. వెంటనే బడ్జెట్ను సవరించి రూ.3 లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.దేశవ్యాప్తంగా జరుగుతున్న ధరల పెరుగుదల, కార్మిక-కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12న జరిగే సమ్మెలో వ్యవసాయ కార్మికులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి.ఏశోభు, సహాయ కార్యదర్శి డి.కుమార్, రాములు, జనార్ధన్, చంద్రమౌళి స్వామి, మోహన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, వినోద, సరోజన, రాసమ్మ, నుస్రత్, మొగులమ్మ, చంద్రశేఖర్, బాలయ్య, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.