manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 10 February 2026, 3:44 am Editor : Mana Praja Prathinidhi

బీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి: ఎమ్మెల్యే పల్లా పిలుపు

•చేర్యాలలో బీఆర్‌ఎస్ భారీ ఎన్నికల ర్యాలీ – ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల వివరాలు
మనప్రజాప్రతినిధి//చేర్యాల.ఫిబ్రవరి10
మున్సిపల్ వార్డు ఎన్నికల ప్రచారం చివరి రోజు సందర్భంగా చేర్యాల పట్టణంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ సెంటర్ నుండి నేతాజీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి, సిపిఎం సిద్ధిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాల ని పట్టణ ప్రజలను కోరారు. ప్రత్యర్థి పార్టీలు అబద్ధపు హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన విమర్శించారు.
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తన నీలిమ హాస్పిటల్‌లో గత రెండు సంవత్సరాలుగా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని, రాబోయే మూడు సంవత్సరాలు కూడా ఈ సేవలను కొనసాగిస్తామని తెలిపారు. పేదలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేస్తూ, అత్యవసర వైద్యం కోసం ఎల్ఓసీలు మంజూరు చేస్తున్నామని చెప్పారు.గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ అభివృద్ధి పనులను, ప్రస్తుత పాలనను పోల్చి ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని ఆయన కోరారు. పట్టణ అభివృద్ధి కొనసాగాలంటే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు.పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.