సదాశివపేట,ఫిబ్రవరి16(మనప్రజాప్రతినిధి):
సదాశివపేట పట్టణంలో జరిగిన 2026 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పులిమామిడి రాజు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉంచిన విశ్వాసానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు నిర్మల జయప్రకాశ్ రెడ్డి మార్గదర్శకత్వంలో పార్టీ కార్యకర్తలు ఐక్యంగా పనిచేసిన ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కట్టుబడి ఉండటమే ప్రజల మద్దతుకు కారణమని తెలిపారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలు పార్టీ విజయానికి బలాన్నిచ్చా యని, ముఖ్యంగా ఎమ్మెల్యే టి. జగ్గారెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు ఓటర్లను ఆకట్టుకున్నాయని చెప్పారు. సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంలో ఆయన పాత్ర కీలకమని కొనియాడారు.జగ్గారెడ్డి ప్రకటించినట్లుగానే మునిపల్లి అంజమ్మ సత్యనారాయణకు చైర్మన్ పదవి, రేణుక చిరంజీవికి వైస్ చైర్మన్ పదవులు ఇవ్వడం ద్వారా మాట నిలబెట్టుకున్న నాయకుడిగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.