•నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు:అభ్యర్థులకు అధికారుల హెచ్చరిక
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.ఫిబ్రవరి04
సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల ఖర్చుల నిర్వహణపై అవగాహన కల్పించేందుకుఅధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బుధవారం స్థానిక సి.నా.రె. కళాభవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నికల నియమావళి అమలు, వ్యయ నియంత్రణపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
అభ్యర్థులు ప్రతిరోజూ చేసే ఖర్చులను తప్పనిసరిగా డే టు డే అకౌంట్స్లో నమోదు చేయాలని, షాడో రిజిస్టర్ నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల వ్యయాలకు ప్రత్యేకంగా తెరిచిన బ్యాంక్ ఖాతా ద్వారానే లావాదేవీలు జరగాలని సూచించారు.అనుమతి లేని ప్రచార వ్యయాలు చేయరాదని, ప్రతి ఖర్చుకు సంబంధించిన బిల్లులు, వౌచర్లు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.స్వచ్ఛమైన, న్యాయమైన ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వ్యయ వివరాల్లో పారదర్శకత పాటించడం ప్రతి అభ్యర్థి బాధ్యత అని పేర్కొన్నారు.ఈ సమావేశంలో జిల్లా ఆర్డీవో, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్, రిటర్నింగ్ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, స్వతంత్ర అభ్యర్థులు పాల్గొన్నారు.