manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 03 February 2026, 5:10 am Editor : MANA PRAJA PRATINIDHI

రాష్ట్రంలో పెరుగుతున్న వీధి కుక్కల బెడద 

– రెండేళ్ల బాలుడిపై దాడి
– హైదరాబాద్ నార్సింగి సర్కిల్‌లో కలకలం
– ఇంటి ముందు ఆడుకుంటుండగానే కుక్కల దాడి
– నిలోఫర్ ఆసుపత్రికి చిన్నారి తరలింపు
– అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం

ఫిబ్రవరి 3 (మనప్రజాప్రతినిధి):
రాష్ట్రవ్యాప్తంగా వీధి కుక్కల బెడదపై ఆందోళన పెరుగుతున్న వేళ, హైదరాబాద్ నగరంలో మరో భయానక ఘటన చోటుచేసుకుంది. నార్సింగి సర్కిల్ పరిధిలో ఇంటి ముందు ఆడుకుంటున్న ప్రభాకర్ అనే వ్యక్తి రెండేళ్ల కుమారుడిపై వీధి కుక్కలు అకస్మాత్తుగా దాడి చేశాయి. చిన్నారి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పరుగెత్తుకొచ్చినా అప్పటికే తీవ్ర గాయాలు అయ్యాయి.కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని కుటుంబ సభ్యులు హుటాహుటిన నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి చికిత్స పొందుతున్నట్లు సమాచారం. చిన్న వయసులోనే ఇలాంటి ఘటన జరగడం తల్లిదండ్రుల్లో తీవ్ర భయాన్ని, ఆవేదనను కలిగిస్తోంది.
నార్సింగి ప్రాంతంలో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిందని, పిల్లలు బయట ఆడాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉందని స్థానికులు వాపోతున్నారు. గతంలోనే పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినా, ఎలాంటి శాశ్వత చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలు, గ్రామాల్లో వీధి కుక్కల దాడుల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజల భద్రతపై ప్రభుత్వ బాధ్యతను ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. పిల్లలు, వృద్ధుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని, ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.