•“ప్రేమించాలి లేదంటే పరువు తీస్తా” – మైనర్ బాలుడి దుశ్చర్య
•పోక్సో చట్టం కింద కేసు నమోదు
మనప్రజాప్రతినిధి//వేములవాడ.ఫిబ్రవరి04
సోషల్ మీడియా పేరుతో మైనర్ బాలికల జీవితాలతో ఆడుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ ద్వారా మైనర్ బాలికను వేధించి, బెదిరించిన మైనర్ బాలుడిపై చందుర్తి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.చందుర్తి మండలానికి చెందిన మైనర్ బాలుడు, అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలికకు ఇన్స్టాగ్రామ్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు, ఫోటోలు పంపుతూ వేధింపులకు పాల్పడ్డాడు. అంతేకాకుండా“నన్ను ప్రేమించకపోతే నీ గురించి నీ తల్లిదండ్రులకు అసభ్యంగా చెబుతాను” అంటూ బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.బాలిక తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుండటాన్ని గమనించిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని జువెనైల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచారు. అక్కడ అతడికి ప్రవర్తనా నియమావళిపై కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ,
సోషల్ మీడియా వేదికగా మైనర్ బాలికలు, మహిళలను వేధించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.
అపరిచితులతో సోషల్ మీడియాలో మితంగా వ్యవహరించాలని, ఏ చిన్న వేధింపునైనా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.ఇలాంటి ఘటనలపై పోలీసులు నిరంతర నిఘా కొనసాగిస్తారని తెలిపారు.