మనప్రజాప్రతినిధి//సిరిసిల్ల.మార్చి1
కులం పేరుతో దూషిస్తూ రాళ్లతో దాడి-నిందితులపై కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక
సిరిసిల్ల పట్టణంలోని బి.వై నగర్లో ఓయువకుడిపై విచక్షణారహితం గా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బాధితుడిని కులం పేరుతో దూషించినందుకు గాను నిందితులపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కె. కృష్ణ తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం… అంబేద్కర్ నగర్కు చెందిన ఆకునూరి కళ్యాణ్ (26) ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి సమయంలో బి.వై నగర్లోని జెండా గద్దె వద్ద ఉన్నాడు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన అతని స్నేహితుల మధ్య పాత గొడవల నేపథ్యంలో వాగ్వాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరిగి నిందితులు కళ్యాణ్ను కులం పేరుతో అసభ్య పదజాలంతో దూషించారు.
అంతటితో ఆగకుండా చేతులు, కాళ్లతో దాడి చేసి, సమీపంలోని బండరాళ్లతో తలపై మరియు శరీరంపై దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారు. తీవ్రంగా గాయపడిన కళ్యాణ్ను కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే పోలీసులను ఆశ్రయించారు.బాధితుడి తల్లి ఆకునూరి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై హత్యాయత్నం సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం కేసుపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.