•6గ్యారంటీలు అమలు కాలేదని విమర్శలు – రైతులు, నిరుద్యోగులు, పింఛన్ లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన
సిద్ధిపేటరూరల్,మార్చి20(మనప్రజాప్రతినిధి):
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని భారతీయ జనతా పార్టీ నాయకులు విమర్శించారు.రాష్ట్రజిల్లా పార్టీ ఆదేశాల మేరకు సిద్ధిపేట రూరల్ మండల అధ్యక్షుడు అన్నసరం సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో మండల రెవెన్యూ అధికారికి వినతిపత్రంసమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు ఇప్పటివరకు అమలు కాలేదని ఆరోపించారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు కొత్త పింఛన్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని తెలిపారు. రైతులకు ఎకరాకు రూ.6000 పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి అమలు చేయక పోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
అదేవిధంగా, జాబ్ కాలెండర్ విడుదల చేయకపోవడం, కళ్యాణ లక్ష్మి,గృహనిర్మాణ పథకాలు అమలు లోపించడం వంటి అంశాలను వారు ప్రస్తావించారు. రైతు భరోసా సమయానికి అందకపోవడంతో రైతులు అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
ఇక వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్ల మంజూరులో ఆలస్యం జరుగుతోందని, అర్హులైన లబ్ధిదారులందరికీ వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు వెంటనే మంజూరు చేయాలని కోరారు.భూ సమస్యలు పరిష్కారం కాకపోవడం, గ్రామాల్లో పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం, ఆదాయం, కుల ధృవీకరణ పత్రాల జారీ ఆలస్యం వంటి సమస్యలను కూడా ప్రస్తావిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో నారాయణరావుపేట మండల అధ్యక్షుడు మెడికాయల శ్రీనివాస్, జిల్లా నాయకులు ముతునేని రాజు, పాపన్నగారి సురేష్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శులు గుర్రం త్రిలోచన్ రెడ్డి, బోయిని సురేష్, మండల నాయకులు గణేష్, వానికంత్, సాయి కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.