manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 09 March 2026, 12:35 pm Posted by : Mana Praja Prathinidhi

ఇళ్ల పట్టాల పంపిణీలో అక్రమాలు

•జిల్లా కలెక్టర్‌కు కోలనూర్ గ్రామస్థుల ఫిర్యాదు
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల,మార్చి9
రాజన్న సిరిసిల్ల జిల్లా మండలంలోని కోలనూర్ గ్రామంలో గతంలో పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల విషయంలో భారీ అక్రమాలు జరిగాయని గ్రామస్థులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్‌కు గ్రామస్థులు వినతిపత్రం సమర్పించారు.గ్రామస్థుల కథనం ప్రకారం సుమారు 25 సంవత్సరాల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కాలనీలో నిరుపేద కుటుంబాలకు ఒక్కొక్కరికి 150 చదరపు గజాల చొప్పున ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. అయితే గ్రామంలోని అసలైన నిరుపేదలకు ఈ పట్టాలు అందకుండా, ఇతర గ్రామాల నుండి వలస వచ్చిన వారికి కేటాయించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.వలస వచ్చిన వారు ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఇళ్లను నిర్మించి, అనంతరం వాటిని ఇతరులకు అమ్ముకుంటున్నారని గ్రామస్థులు తెలిపారు. అంతేకాక ప్రభుత్వం కేటాయించిన 150 చదరపు గజాల స్థలానికి అదనంగా కొంతమంది సుమారు 3 గుంటల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని కబ్జా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
న్యాయం చేయాలని డిమాండ్
ప్రభుత్వ భూమి అక్రమ కబ్జాకు గురికాకుండా చూడాలని, అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసి గ్రామంలోని అర్హులైన నిరుపేదలకు ఇళ్ల పట్టాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోలనూర్ గ్రామస్థులు జిల్లా కలెక్టర్‌ను కోరారు. తమ గ్రామానికి న్యాయం చేయాలని వారు విన్నవించారు.
ఈ కార్యక్రమంలో వీరబోయిన తిరుపతి, తుడి దేవేందర్ రావు, తాళ్లపెల్లి శేఖర్, సుద్దాల చంద్రయ్య, వీరబోయిన దేవేందర్, వెన్నమనేని సాయి, పెద్ది పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.