మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.మార్చ్1
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన విషాద సంఘటన శుక్రవారం రాత్రి సిద్దిపేట జిల్లాలోని కొండపాక మండలంలో చోటుచేసుకుంది.సిద్దిపేట త్రీటౌన్ సీఐ లక్ష్మీ బాబు తెలిపిన వివరాల ప్రకారం… కొండపాక మండలంలోని విశ్వనాధ్పల్లి గ్రామానికి చెందిన గొడుగు ఆంజనేయులు (23) తన స్నేహితులతో కలిసి సిద్దిపేటలో పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో తనతో పని చేస్తున్న సిరిసినగండ్ల గ్రామానికి చెందిన నాగరాజు తన వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగినట్లు సమాచారం అందడంతో, ఆంజనేయులు తన స్నేహితులతో కలిసి వెంటనే అక్కడికి వెళ్లాడు.
నాగరాజును నవీన్, ప్రశాంత్ కలిసి చికిత్స నిమిత్తం సిద్దిపేటకు తీసుకువెళ్తుండగా, వారి వెనుక బైక్పై ఆంజనేయులు, గణేష్, పరమేష్ బయలుదేరారు. ఈ క్రమంలో పొన్నాల గ్రామ శివారులో ఆంజనేయులు బైక్ను అతివేగంగా నడపడంతో అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టుకు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ఆంజనేయులు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మిగతా ఇద్దరు యువకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ తెలిపారు.