manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 2:43 pm Editor : Mana Praja Prathinidhi

ఫిర్యాదు తర్వాత మారిన కుమారులు – పోలీసుల కౌన్సిలింగ్ ఫలితం

•వృద్ధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు – పోలీసులు

వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన కుమారులకు కౌన్సిలింగ్ కొండపాకమండలం.మార్చి25(మనప్రజాప్రతినిధి):
కొండపాక మండలంలో వృద్ధ తల్లిదండ్రులను సరిగా చూసుకోకపోవడంతో కుమారులకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించిన సంఘటన సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ టి. లక్ష్మీబాబు తెలిపిన వివరాల ప్రకారం… ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన పాముకుంటా నర్సయ్య – ఎల్లవ్వ దంపతులు తమ ముగ్గురు కుమారులు యాదగిరి, కిష్టయ్య, దేవయ్యలకు కష్టార్జిత ఆస్తులను సమానంగా పంచిపెట్టినా, తమకు సరైన పోషణ అందడం లేదని ఈ నెల 18న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఫిర్యాదుపై స్పందించిన ఇన్స్పెక్టర్ టి.లక్ష్మీబాబు బుధవారం (మార్చి25) ముగ్గురు కుమారులు, వారి భార్యలను స్టేషన్‌కు పిలిపించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించా రు. వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ ప్రతి కుమారుని ప్రాథమిక బాధ్యత అని, తల్లిదండ్రులు చేసిన త్యాగాలను గుర్తుంచుకుని వారిని వృద్ధాప్యంలో ఆదరించడం, పోషణ అందించడం, ఆరోగ్య పరిరక్షణ చూడడం తప్పనిసరి కర్తవ్యమని సూచించారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం నైతికంగానే కాకుండా చట్టపరంగానూ శిక్షార్హమని హెచ్చరించారు.కౌన్సిలింగ్ అనంతరం కుమారులు తమ తల్లిదండ్రులను ఇకపై సక్రమంగా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి నెల ఒక్కొక్కరు రూ.1,500 చొప్పున ఖర్చులకు అందించడంతో పాటు ఆరోగ్య సమస్యలు వచ్చినపుడు సంయుక్తంగా వైద్యసహాయం అందిస్తామని తెలిపారు.ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, పోలీస్ కమిషనర్ సాధన రష్మి పెరుమాళ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు వృద్ధుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన వారిపై ఫిర్యాదులు వస్తే కౌన్సిలింగ్ నిర్వహిస్తామని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి 15 రోజులకు ఖమ్మంపల్లి గ్రామాన్ని స్వయంగా సందర్శించి వృద్ధ దంపతుల పరిస్థితిని పరిశీలిస్తానని తెలిపారు.
ఇన్స్పెక్టర్ జోక్యంతో కుటుంబ వివాదం సఖ్యతగాపరిష్కారమవడంతో పాముకుంటా నర్సయ్య – ఎల్లవ్వ దంపతులు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.