manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 19 May 2026, 9:23 am Editor : Mana Praja Prathinidhi

పసి గుండెలకు ప్రాణవాయువుగా సంజీవని

ఉచిత గుండె వైద్యంతో వేల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న ఆస్పత్రి:మంత్రి పొన్నం ప్రభాకర్
మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.మే19
అభం శుభం తెలియని చిన్నారుల గుండె సమస్యలకు అండగా నిలుస్తూ, పేద కుటుంబాలకు కొత్త జీవితం ఇస్తోన్న శ్రీ సత్య సాయి సంజీవని హార్ట్ కేర్ సెంటర్ సేవలు అపూర్వమని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు.
కొండపాక శివారులోని శ్రీ సత్య సాయి సంజీవని ఆస్పత్రిని సోమవారం సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్, అక్కడ గుండె శస్త్రచికిత్సలు పొందుతున్న చిన్నారులకు “గిఫ్ట్ ఆఫ్ లైఫ్” సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే చిన్నారులకు పూర్తిగా ఉచితంగా పరీక్షలు, స్కానింగ్‌లు, శస్త్రచికిత్సలు, మందులు అందించడం గొప్ప మానవతా సేవ అన్నారు. పేద పిల్లల గుండెల్లో ఆశ నింపుతూ వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తున్న ఈ ఆస్పత్రి సేవలు అందరికీ ఆదర్శమన్నారు.
చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు అంకితభావంతో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ నర్సింలు, సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి, ఆస్పత్రి చైర్మన్ శ్రీనివాస్, వెలికట్ట సర్పంచ్ మానస, తిమ్మారెడ్డిపల్లి సర్పంచ్ కొయ్యడ వెంకటేశం గౌడ్, నాయకులు వాసరి లింగారావు, సురేందర్ రావు, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, రోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.