manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 23 June 2026, 8:11 am Posted by : Mana Praja Prathinidhi

విద్యార్థులే దేశ భవిష్యత్తు

•దుద్దెడ జడ్పీహెచ్‌ఎస్‌లో మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం
మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం,జూన్23
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ దుద్దెడ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్పీహెచ్‌ఎస్)లో విద్యార్థులకు యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ వాసుదేవ్ రావు, ఎస్‌ఐలు మల్లేశం, మహేష్ పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ వాసుదేవ్ రావు మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదకరమైన వ్యసనాలని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించి, ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధనకు కృషి చేయాలని సూచించారు. కొంతమంది అసాంఘిక వ్యక్తులు యువతను మాదకద్రవ్యాల వైపు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి వారి మాటలకు లోనుకాకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
పాఠశాలలు, కళాశాలల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా మాదకద్రవ్యాలను విక్రయిస్తున్నట్లు లేదా వినియోగిస్తున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు కుటుంబ, సామాజిక, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురవుతాయని వివరించారు.
ఎస్‌ఐలు మల్లేశం, మహేష్ మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. స్నేహితుల ఒత్తిడి లేదా ఆసక్తి కారణంగా ఎలాంటి మత్తు పదార్థాలను ఉపయోగించరాదని, క్రమశిక్షణతో ముందుకు సాగి ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.
అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటంతో పాటు ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో ప్రతి విద్యార్థి భాగస్వామి కావాలని పోలీసులు పిలుపునిచ్చారు.