manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 8:29 pm Posted by : Mana Praja Prathinidhi

ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం

•విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు యోగా దిక్సూచి : ప్రిన్సిపాల్ దేవయ్య
యోగ క్రమశిక్షణ, ఏకాగ్రతను పెంపొందిస్తుంది : ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ దరిపల్లి నగేష్
సిద్దిపేట, జూన్ 20 : సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (కో-ఎడ్యుకేషన్)లో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వివిధ యోగాసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామాలు నిర్వహించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ దేవయ్య మాట్లాడుతూ, ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు, శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడానికి యోగా అత్యంత అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రతిరోజూ కనీసం అరగంటపాటు యోగాభ్యాసం చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. పరీక్షల సమయంలో ఒత్తిడిని తగ్గించడంతో పాటు జ్ఞాపకశక్తి పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ దరిపల్లి నగేష్ మాట్లాడుతూ, యువతలో క్రమశిక్షణ, ఏకాగ్రత, సేవాభావాన్ని పెంపొందించడంలో యోగా ముఖ్యపాత్ర పోషిస్తుందని అన్నారు. సమాజ సేవలో చురుకుగా పాల్గొనేందుకు అవసరమైన శారీరక, మానసిక శక్తిని యోగా అందిస్తుందని వివరించారు.
అనంతరం స్టూడెంట్ కౌన్సిలర్లు కనక చంద్రం, ఫాతిమా, స్పోర్ట్స్ ఇన్‌చార్జ్ అశోక్ విద్యార్థి దశ నుంచే ఆరోగ్య నియమాలను పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. క్రమశిక్షణ కమిటీ ఇన్‌చార్జ్ నంటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యలక్ష్మి విద్యార్థులకు యోగాసనాలను ప్రదర్శించి నేర్పించారు. విద్యార్థులు పలు క్లిష్టమైన ఆసనాలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. అలాగే ప్రాణాయామం, ధ్యానం కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రఘురాజ్ దాస్, రాజశేఖర్ రెడ్డి, అఖిల్, వెంకటరమణ, నరేందర్ రెడ్డి, కొమురయ్య, శ్రీకాంత్, రవి, గంగాధర్, సత్యనారాయణ, విజయ భాస్కర్, శ్రీనివాస్, కబడ్డీ రిఫరీ వెంకటేష్, నాన్-టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.