manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 8:40 am Posted by : Mana Praja Prathinidhi

3తులాల బంగారు గొలుసు లాక్కెళ్లిన దుండగులు

-పండ్లు కొనుగోలు చేస్తున్నట్లు నటించి దోపిడీకి పాల్పడిన కేటుగాళ్లు
-టోల్‌గేట్ వద్ద మహిళపై దాడి.. క్షణాల్లో చైన్‌తో పరార్
కొండపాకమండలం,జులై1(మనప్రజాప్రతినిధి): సిద్దిపేటజిల్లా. కొండపాక మండలం దుద్దెడ టోల్‌గేట్ వద్ద పట్టపగలు దోపిడీ కలకలం రేపింది. గ్రామంలో రోడ్డు పక్కన పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న ఎరుకల కనకవ్వ (50) అనే మహిళను లక్ష్యంగా చేసుకున్న ఇద్దరు దుండగులు అత్యంత చాకచక్యంగా ఆమె మెడలో ఉన్న 3 తులాల బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని పరారయ్యారు.
పండ్లు కొనుగోలు చేస్తున్నట్లు నటిస్తూ మహిళకు దగ్గరైన దుండగులు, ఆమె అప్రమత్తంగా లేని సమయంలో ఒక్కసారిగా మెడలోని బంగారు గొలుసును లాగి బైక్‌పై మెరుపువేగంతో అక్కడి నుంచి ఉడాయించారు. ఊహించని ఘటనతో బాధితురాలు షాక్‌కు గురై గట్టిగా కేకలు వేయగా, అప్పటికే నిందితులు పరారయ్యారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టోల్‌గేట్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రద్దీగా ఉండే ప్రాంతంలోనే ఈ ఘటన జరగడం స్థానికుల్లో తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. పోలీసులు త్వరితగతిన నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.