manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 7:38 am Posted by : Mana Praja Prathinidhi

రాజీవ్ గాంధీ ఆశయాలతో బలమైన భారత్

సద్భావనా దినోత్సవం ప్రజలకు స్ఫూర్తిదాయకం
రాజీవ్ గాంధీకి సీఎం రేవంత్ ఘన నివాళి
శాంతి, సౌభ్రాతృత్వంతో దేశ నిర్మాణానికి పిలుపు
హైదరాబాద్,ఆగస్టు21(మనప్రజాప్రతినిధి): మాజీ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆయనకు ఘన నివాళులర్పించారు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో రాజీవ్ గాంధీ అందించిన సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. దేశ అభివృద్ధితో పాటు ప్రజల మధ్య శాంతి, సౌభ్రాతృత్వం, మత సామరస్యం, ఐక్యతను పెంపొందించాలనే ఆయన ఆలోచనలు నేటికీ ప్రాసంగికమని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే సద్భావనా దినోత్సవం ప్రజలందరికీ గొప్ప స్ఫూర్తిని అందిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. సమాజంలో విభేదాలకు తావులేకుండా పరస్పర గౌరవం, సోదరభావంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవడం ద్వారా దేశ ప్రగతికి మరింత బలమైన పునాది వేయగలమని పేర్కొన్నారు.
దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, మత సామరస్యం, జాతీయ ఐక్యతను బలోపేతం చేయాలనే రాజీవ్ గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్రజల మధ్య పరస్పర విశ్వాసం పెంపొందించడం, సామాజిక సామరస్యాన్ని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. ‘సమైక్యతే మన శక్తి – సద్భావనే మన ప్రగతి’ అనే స్ఫూర్తితో సమాజంలోని అన్ని వర్గాలు కలిసి ముందుకు సాగాలని రేవంత్ రెడ్డి సూచించారు. కుల, మత, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా ప్రజలందరూ దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఐక్యత, సమానత్వం, సోదరభావం ఉన్న సమాజమే బలమైన దేశానికి పునాది అవుతుందని పేర్కొన్నారు.
రాజీవ్ గాంధీ ఆశయాలను నేటి తరానికి చేరువ చేయడంతో పాటు వాటిని ఆచరణలో పెట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ దేశ సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. శాంతియుత, సామరస్యపూర్వక వాతావరణం ఏర్పడినప్పుడే సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
సద్భావనా దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ పరస్పర ఐక్యత, సామరస్యం, సమానత్వం కోసం పునరంకితం కావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ చూపిన మార్గంలో శాంతి, సౌభ్రాతృత్వంతో కూడిన బలమైన భారతదేశ నిర్మాణానికి తమ వంతు కృషి చేయాలని కోరారు.