దుర్వాసనతో ప్రజల అవస్థలు
లక్షలు ఖర్చు చేసి కట్టారు.. నిరుపయోగంగా వదిలేశారు!
మనప్రజాప్రతినిధి/ రాజన్నసిరిసిల్ల
ఆగష్టు,29
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్వచ్ఛతకు తూట్లు
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ కార్యాలయం పక్కన ఉన్న మున్సిపల్ పబ్లిక్ మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. చాలా రోజులుగా మూతపడి ఉండటంతో పరిసర ప్రాంతమంతా పిచ్చి మొక్కలు పెరిగి, తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది.
దీంతో ఆ మార్గంలో నడవడానికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాంతానికి సమీపంలోనే ఆర్డీవో కార్యాలయం, పోలీస్ స్టేషన్, పలు ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే వందలాది మందికి మరుగుదొడ్లు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రజాధనంతో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లను ఇలా నిర్వహణ లేకుండా వదిలేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి మరుగుదొడ్లను శుభ్రం చేసి, తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.