manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 8:56 am Posted by : Mana Praja Prathinidhi

పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

“రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి ఆదేశం
మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.సెప్టెంబర్20
కొండపాక మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అటెండెన్స్ రిజిస్టర్, ఓపీ రిజిస్టర్‌లను తనిఖీ చేశారు. మెడికల్ ఆఫీసర్ నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు విధులకు నిర్ణీత సమయానికి హాజరవుతున్నారా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ కేసుల వివరాలను ఎప్పటికప్పుడు ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్ల ద్వారా తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని మెడికల్ ఆఫీసర్‌కు సూచించారు.
అదేవిధంగా ఆసుపత్రిలో అవసరమైన మందులు, వైద్య సామగ్రిని తగినంతగా అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ప్రతి వారం నిర్వహించే పారిశుద్ధ్య కార్యక్రమాల్లో వైద్య సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనాలని, సీజనల్ వ్యాధుల నివారణపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.