manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 4:29 pm Posted by : MANA PRAJA PRATINIDHI

మనప్రజాప్రతినిధి tv కథనానికి తక్షణమే స్పందన లంచం ఆరోపణలపై ఈసీని సస్పెండ్ చేసిన  సూర్యాపేట జిల్లా కలెక్టర్‌

మనప్రజాప్రతినిధి//సూర్యాపేట జిల్లా, ఆగస్టు018

సూర్యాపేట జిల్లా, నాగారం: ఉపాధి హామీ పథకం పనుల్లో లబ్ధిదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు సూర్యాపేట జిల్లాలో కలకలం రేపాయి. నాగారం మండలం శాంతినగర్ గ్రామంలో పశువుల కొట్టాలు, కోళ్ల ఫారం షెడ్ల మంజూరు వ్యవహారంలో లంచం డిమాండ్ చేస్తున్నారంటూ లబ్ధిదారులు ఇంజనీరింగ్ కన్సల్టెంట్‌ (ఈసీ)పై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
లబ్ధిదారుల వివరాల ప్రకారం.. శాంతినగర్ గ్రామానికి తొమ్మిది పశువుల కొట్టాలు, ఒక కోళ్ల ఫారం షెడ్డు మంజూరయ్యాయి. అయితే పశువుల కొట్టాలకు రూ.5 వేల చొప్పున, కోళ్ల ఫారం షెడ్లకు రూ.10 వేల చొప్పున డబ్బులు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. పనులకు సంబంధించి కొలతలు (ఎంబీలు) చేయడం, బిల్లుల ప్రక్రియ ముందుకు తీసుకెళ్లడం వంటి అంశాల్లో ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపణ

ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోయిందని లబ్ధిదారులు ఆరోపించారు. దీంతో చివరకు జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించి తమ సమస్యను వివరించారు. అక్రమ వసూళ్లపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

మనప్రజాప్రతినిధి కథనానికి కలెక్టర్ స్పందన

ఈ వ్యవహారంపై మన ప్రజాప్రతినిధి న్యూస్లో కథనం ప్రచురితమైన అనంతరం జిల్లా యంత్రాంగం స్పందనా అనంతరం ఈసీపై చర్యలు తీసుకుంటూ సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సస్పెన్షన్ వేటు వేశారు.
లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై అధికారులు దృష్టి సారించడంతో పాటు, ఉపాధి హామీ పథకం పనుల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.