manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 15 November 2025, 7:00 am Posted by : Mana Praja Prathinidhi

అతి వేగం.. ప్రాణాలకు పంజా

– తెలంగాణ పోలీస్ కీలక హెచ్చరిక
– రహదారులపై వేగమే ప్రమాదాలకు ప్రధాన కారణం
– స్పీడ్ డ్రైవింగ్‌తో ప్రాణాలు మాయమవుతాయన్న జాగృతి
– సురక్షిత డ్రైవింగ్‌తోనే ఇంటికి సురక్షితంగా చేరిక

(హైదరాబాద్, నవంబర్ 15) (మనప్రజాప్రతినిధి):
రహదారులపై నియంత్రణ లేకుండా అతి వేగంతో ప్రయాణాలు చేస్తే, చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదంగా మారొచ్చని తెలంగాణ పోలీస్ మరోసారి ప్రజలకు గట్టిగా హెచ్చరిక జారీ చేసింది. వేగమే ఎక్కువ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని, ప్రతి రోజూ ఖరీదైన ప్రాణాలను కోల్పోతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరి చేశాయి.
డ్రైవింగ్‌లో వేగం పెంచడం వల్ల వాహనంపై నియంత్రణ కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో పాటు, ఏ ప్రమాదాన్ని ముందే గుర్తించి నిలబెట్టే అవకాశాలు కూడా తగ్గిపోతాయని అధికారులు వివరించారు. రోడ్డు ఖాళీగా ఉందనే కారణంతో స్పీడ్‌గా వెళ్లడం అత్యంత ప్రమాదకరమని పోలీసులు స్పష్టం చేశారు. ప్రతి వాహనం, ప్రతి పరిస్థితి ఒక్కో విధంగా స్పందిస్తుందని, అతి వేగం ఎప్పటికీ సురక్షితం కాదని పేర్కొన్నారు.అతి వేగం ఎప్పటికీ ఎవరికీ ప్రయోజనం చేకూర్చదనీ, కానీ ప్రాణాలకు మాత్రం భారీ ప్రమాదమేననిలు గుర్తు చేశారు. కుటుంబాలపై, స్నేహితులపై, తమపై జరిగే అనర్థాలను స్పీడ్ డ్రైవింగ్‌తో ఎవరూ తేలికగా తీసుకోకూడదని సూచించారు. “స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్” అనే నినాదాన్ని మళ్లీ గుర్తుచేస్తూ, చిన్న తప్పిదం కూడా జీవితాన్ని పూర్తిగా మార్చగలదని హెచ్చరించారు.సురక్షిత డ్రైవింగ్‌తోనే కుటుంబాలు ప్రశాంతంగా ఉండగలవని, మీ నిర్ణయాలు ఇతరుల ప్రాణాలపైనా ప్రభావం చూపుతాయని పోలీసులు తెలిపారు. వాహనం నెమ్మదిగా నడపడం సిగ్గు కాదు, అది బాధ్యత అని వారు తేల్చిచెప్పారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే రోడ్లు అందరికీ సురక్షితమవుతాయని తెలంగాణ పోలీస్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.