“తల్లితో కలిసిఇంటికి వెళ్తుండగా ఘటన..ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
“రోడ్డుపైకి ఒక్కసారిగా వచ్చిన పందులగుంపు..చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం:ఆగస్టు17
రాత్రి తన పని ముగించుకొని ఇంటికివెళుతున్న క్రమంలో రోడ్డుపై అకస్మాత్తుగా వచ్చిన అడవి పందులు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. సిద్దిపేట రూరల్ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. చింతమడక గ్రామానికి చెందిన బాగాల కృష్ణమాచారి(38) నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో నివాసముంటూ సిద్దిపేటలో స్వర్ణకారుడిగా పనిచేస్తున్నాడు.
ఈ నెల 14న రాత్రి కృష్ణమాచారి తన తల్లిరాజేశ్వరి (75)తో కలిసి టిజీ36సి1076 గల హోండా యాక్టివాపై సిద్దిపేట నుంచి లక్ష్మీదేవిపల్లికి వెళ్తుండగా బండచర్లపల్లి త్రిమూర్తి ఫర్నిచర్ కంపెనీ సమీపంలో ఒక్కసారిగా అడవి పందుల గుంపు రోడ్డుపైకి వచ్చింది. దీంతో పందులు బైకును ఢీకొట్టడంతో కృష్ణమాచారి, ఆయన తల్లి కిందపడిపోయారు.
ఈ ప్రమాదంలో కృష్ణమాచారి తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందాడు. ఆయన తల్లి రాజేశ్వరికి స్వల్ప గాయాలయ్యాయి.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య గీతాప్రియతో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.