– సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి ఎస్ఐటీ నోటీసులు
– ఇద్దరు బీఆర్ఎస్ నేతలకూ విచారణకు పిలుపు
– రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలన్న ఆదేశాలు
హైదరాబాద్, జనవరి 7 (మనప్రజాప్రతినిధి):
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది.దర్యాప్తులో భాగంగా, రేవంత్ రెడ్డి విపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో కొండల్ రెడ్డి ఫోన్ను ట్యాప్ చేసినట్లు ఆధారాలు లభించాయని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన వాంగ్మూలం నమోదు చేసుకునేందుకు విచారణకు పిలిచినట్లు అధికారులు తెలిపారు.ఇదే కేసులో మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలకు కూడా ఎస్ఐటీ నోటీసులు పంపింది. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలను కూడా రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావులకు కూడా ఇలాంటి నోటీసులు అందినట్లు అధికారులు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎస్ఐటీ దర్యాప్తు కొనసాగుతోందని, సంబంధితులందరి వాంగ్మూలాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
RELATED ARTICLES

