•బ్రహ్మముహూర్తం నుంచి అఖండ నామస్మరణతో మహాదేవునికి విశేష పూజలు
•శివస్వాముల ఆధ్వర్యంలో శ్రీ సంగమేశ్వర మందిరంలో ఘన ఆధ్యాత్మిక కార్యక్రమం
•భారీగా తరలివచ్చిన భక్తులు-అన్నప్రసాదంతో పుణ్యఫలితం
సదాశివపేట,జనవరి18(మనప్రజాప్రతినిధి):
సదాశివపేట పట్టణంలోని స్థానిక శ్రీ సంగమేశ్వర మందిరంలో ఆదివారం భక్తిశ్రద్ధల మధ్య పరమేశ్వరునికి లక్ష బిల్వదళాలచే మహాభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఉదయం నాలుగు గంటల నుంచే శివస్వాముల భక్తబృందం త్రిదళ పత్రాలతో “ఓం నమశ్శివాయ” నామస్మరణ చేస్తూ ముల్లోకాలకు అధిపతి అయిన మహాదేవునికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తి మయంగా మారింది.అలాగే ఉదయం బ్రహ్మముహూర్తం నుంచి రాత్రి 9 గంటల వరకు అఖండ నామస్మరణ నిర్వహించగా, పార్వతీ పరమేశ్వరుల కరుణ కృపలతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. దర్శనానికి వచ్చిన భక్తుల కోసం అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమాన్ని పార్వతీ పరమేశ్వరుల ప్రియ భక్తుడు గురుస్వామి రాచన్న, నారాయణస్వామి వారి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వాములు మల్లేశం, లోకేష్, సురేష్, వెంకట్, శ్రీనివాస్, శంకర్, రాజశేఖర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా విజయ వంతం చేశారు.శివకృపతో పట్టణ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని భక్తులు ఈ సందర్భంగా ప్రార్థించారు.

