– మేడిపల్లిలో ప్రేమ జంట ఆత్మహత్య
– వరుస రోజుల్లో ఇద్దరూ మృతి
– కుటుంబాల్లో తీవ్ర విషాదం
రంగారెడ్డి జిల్లా, జనవరి 7 (మనప్రజాప్రతినిధి):
రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని మేడిపల్లి గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఒక రోజు తేడాలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.మేడిపల్లి గ్రామానికి చెందిన మహేశ్ (20), అదే గ్రామానికి చెందిన ఓ బాలిక (16) గత నాలుగు నెలలుగా ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. బాలిక ఇబ్రహీంపట్నంలోని కార్తికేయ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో పెద్దలు ఇద్దరినీ కలవకుండా అడ్డుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన జంట గతంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించినప్పటికీ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.ఇటీవల సోమవారం మహేశ్ బాలికకు ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినట్లు సమాచారం. ఈ మాటలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన బాలిక మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతి విషయం తెలిసిన మహేశ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనై, బుధవారం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ దుర్ఘటనతో రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రేమ వివాహాల విషయంలో కుటుంబాల మధ్య సంభాషణ, అవగాహన అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ప్రేమ వివాహానికి అంగీకారం లభించక విషాదాంతం
RELATED ARTICLES

