గుంటూరు జనవరి 7 (మన ప్రజా ప్రతినిధి ):
రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజల సమస్యలను విస్మరించి నేల విడిచి సాము చేస్తున్నట్టు వ్యవహరిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల అవసరాలు, ఇబ్బందులపై కనీసం మాట్లాడే స్థితిలో కూడా ప్రభుత్వం లేకపోవడం బాధాకరమన్నారు.ఎన్నికల ముందు పేదవారికి, అన్ని వర్గాల ప్రజలకు విద్య, వైద్యం అందిస్తామని హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలు ముగిసిన వెంటనే “ఏరు దాటిన తర్వాత తెప్ప తెగిలేసినట్టు” ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా వైద్య రంగంలో పీపీపీ విధానాల పేరుతో ప్రజలకు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని తెలిపారు.ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 17 మెడికల్ కాలేజీల్లో 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానమని, పీపీపీ నుంచి చంద్రబాబు ప్రభుత్వం వెంటనే వెనక్కు తగ్గాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రానున్న ఎన్నికల్లో ప్రజలే ఈ ప్రభుత్వాన్ని వెనక్కు పంపిస్తారని హెచ్చరించారు.సంక్రాంతి తర్వాత సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, పీపీపీని రద్దు చేస్తారా లేక ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తారా అన్నది తేల్చుకోవాల్సిందేనని అన్నారు. ఇప్పటికే అనేక రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. భోగి పండుగ రోజు గ్రామాలు, పట్టణాల్లో భోగి మంటల్లో పీపీపీ జీఓ కాపీలను దగ్ధం చేస్తామని ప్రకటించారు. ప్రజానీకం అంతా స్పందించిఉద్యమంలోభాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు.
అలాగే నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నా ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందని విమర్శించారు. “రోమ్ నగరం తగలబడుతుంటే నీరో వాయిద్యం వాయించినట్టు” చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏం కొనాలన్నా, ఏం తినాలన్నా అందుబాటులో లేని పరిస్థితి నెలకొందన్నారు. ధరల పెరుగుదలకు నిరసనగా ప్రజలను సమీకరించి సిపిఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని తెలిపారు.ఇంటి స్థలాల పంపిణీ అంశంలో కూడా ప్రజలను వరుసగా మోసం చేస్తున్నారని జంగాల అజయ్ కుమార్ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అర్హులైన వారికి గ్రామాల్లో ఒక సెంటు, పట్టణాల్లో ఒక సెంటు ఇస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తానని చంద్రబాబు నాయుడు చెప్పి ప్రజలను మాయమాటలతో ముంచేశారని విమర్శించారు.ఇప్పటికే సిపిఐ ఆధ్వర్యంలో అన్ని మండల కార్యాలయాల్లో అర్జీలు పెట్టించామని గుర్తు చేశారు. ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్న పాలకులు చివరకు ప్రజల శాపానికి గురవుతారని చంద్రబాబు నాయుడికి జంగాల అజయ్ కుమార్ హెచ్చరించారు.

