మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్లజిల్లా,ఫిబ్రవరి18
కుటుంబ ఆర్థిక ఇబ్బందులు మరో నిండు ప్రాణాన్ని బలితీసుకున్న విషాద ఘటన బోయినపల్లి మండలం దుబ్బపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన యువకుడు ఫీజులు చెల్లించలేని పరిస్థితుల్లో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.దుబ్బపల్లి గ్రామానికి చెందిన రామంచ సంజయ్ (18) హైదరాబాద్లోని అవంతి కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో సకాలంలో కళాశాల ఫీజులు చెల్లించలేకపోయాడు. దీనికి తోడు ఇంట్లో అక్క వివాహం వంటి ఇతర ఆర్థిక బాధ్యతలు కూడా ఉండటంతో సంజయ్ గత మూడు నెలలుగా కళాశాలకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.బుధవారం ఉదయం తండ్రి అశోక్ చిన్న విషయంపై మందలించడంతో ఇప్పటికే మానసిక ఒత్తిడిలో ఉన్న సంజయ్ మరింత మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఫ్యాన్కు టవల్తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమాకాంత్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు కొనసాగిస్తు న్నట్లు వెల్లడించారు.కళ్లముందే ఎదుగుతున్న కుమారుడు విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవు తున్నారు. ఈ ఘటనతో దుబ్బపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
బీటెక్ విద్యార్థి బలవన్మరణం-ఆర్థిక ఇబ్బందులు కారణమా?
RELATED ARTICLES

