•వి.బి.జి.రాంజీ చట్టం రద్దు చేసి ఉపాధి హామీ కొనసాగించాలి-తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ సదాశివపేట,ఫిబ్రవరి17(మనప్రజాప్రతినిధి):
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సదాశివపేట మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఎంపీడీవో కొండా లక్ష్మి కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. నర్సిములు మాట్లాడుతూ, రేక్కాడితే గాని డొక్కాడని పేదల జీవనాధారం అయిన ఉపాధి హామీ పనులను బలహీనపరిచే విధానాలను వెంటనే ఉపసంహరించుకోవా లని కోరారు. వి.బి.జి. రాంజీ చట్టాన్ని రద్దు చేసి, మహాత్మా గాంధీ పేరు మీద అమలులో ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ పథకం ద్వారా కల్పించే పనుల ఆధారంగా అనేక గ్రామీణ పేదలు జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు.పని ప్రదేశాల్లో పనిముట్లు అందుబాటు లో లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే అవసరమైన పనిముట్లు ఇవ్వాలని, అలాగే తాగునీరు, టెంట్లు, మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలని కోరారు. చేసిన పనికి 15 రోజుల్లోపు కూలి చెల్లింపులు చేయాలని కూడా డిమాండ్ చేశారు.మండల అధ్యక్షుడు ఎం. మల్లేశం, కార్యదర్శి టి. ఏశోబు మాట్లాడుతూ ప్రతి వారం పే స్లిప్పులు ఇవ్వకపోవడం వల్ల కూలీలకు రోజుకూలి వివరాలుతెలియక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణం గా రోజుకూలిని రూ.800కు పెంచాలని, సంవత్సరానికి కనీసం 200 పని దినాలు కల్పించాలని కోరారు. పనిస్థలాల్లో గాయపడినకూలీలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందించి, కోలుకునే వరకు కూలి చెల్లించాలని డిమాండ్ చేశారు.డిమాండ్లను వెంటనే పరిష్కరించక పోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని సంఘం నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు రవి, మొగులయ్య, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పనులను కొనసాగించాలి – సదాశివపేటలో కార్మిక సంఘం వినతి
RELATED ARTICLES

