మెదక్ – మన ప్రజాప్రతినిధి, నవంబర్ 26
సర్వీస్ గన్, కేసులో స్వాధీనం బంగారం తాకట్టు — టాస్క్ ఫోర్స్ అదుపులోకి
అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై భాను ప్రకాశ్ బెట్టింగ్ వ్యసనంతో ప్రమాదకర స్థాయికి వెళ్లి అధికార ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా వ్యవహరించిన ఘటన సంచలనంగా మారింది. పెద్దఎత్తున బెట్టింగ్లో పాల్గొని అప్పుల్లో కూరుకుపోయిన ఆయన, అప్పులు తీర్చుకునేందుకు క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే—ఓ రికవరీ కేసులో స్వాధీనం చేసుకున్న ఐదు తులాల బంగారం ను ఎస్సై తన వ్యక్తిగత అవసరాలకు తాకట్టు పెట్టినట్టు విచారణలో బయటపడింది. ఇదే విషయాన్ని పరిశీలిస్తున్న అధికారులకు మరో కీలక అనుమానం తలెత్తింది. ఎస్సై వద్ద ఉండాల్సిన సర్వీస్ గన్ కనిపించకపోవడంతో ఉన్నతాధికారులు ప్రశ్నించగా స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయాడు.
తరువాత లోతైన విచారణలో ఆ తుపాకీని కూడా ఒక బ్రోకర్ వద్ద తాకట్టు పెట్టి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారం బయటపడిన వెంటనే టాస్క్ ఫోర్స్ పోలీసులు ముందుకు వచ్చి భాను ప్రకాశ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఈ ఘటనతో పోలీస్ శాఖలో తీవ్ర చర్చలు మొదలయ్యాయి. బాధ్యతాయుతమైన స్థాయిలో ఉన్న అధికారి ఇలాంటి చర్యలకు పాల్పడటం పట్ల ప్రజలు, పోలీస్ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

