- బాబా ఆలోచనలను ప్రజల్లో విస్తరించేందుకు సీఎం రేవంత్ హామీ
- విద్య–వైద్యం–తాగునీటి సేవలకు సాయిబాబా చేసిన కృషిని స్మరించిన సీఎం
- పుట్టపర్తి శతజయంతి వేడుకల్లో జాతీయ స్థాయి ప్రముఖుల పాల్గొనడం ప్రత్యేకత
- పుట్టపర్తి, 23 నవంబర్ (మనప్రజాప్రతినిధి):
- భగవాన్ సత్య సాయిబాబా గారి ఆలోచనలు, ఆశయాలను జనజీవనంలో మరింత విస్తరించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. సాయిబాబా గారి శతజయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన గుర్తుచేశారు.
- పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన శతజయంతి ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబా చూపిన సేవా మార్గం, మానవతా దృక్పథం దేశానికే మార్గదర్శకమని ఆయన పేర్కొన్నారు.
- “సాయిబాబా గారు మనుషుల్లో దేవుడిని చూశారు. ప్రేమతో గెలిచారు. సేవలతో దేవుడిగా కొలువబడ్డారు” అని పేర్కొన్న సీఎం, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించి పేదల భవిష్యత్తు మార్చిన సేవలను ప్రత్యేకంగా గుర్తుచేశారు. వైద్య సేవలు, తాగునీటి సదుపాయాల కల్పనలో బాబా చేసిన కృషి ప్రభుత్వాలు చేయలేని స్థాయిలో ఉందని అన్నారు. తెలంగాణ పాలమూరు, ఆంధ్రములోని అనంతపురం, తమిళనాడులో కూడా బాబా సేవలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయని వివరించారు.
- 140 దేశాల్లో బాబా భక్తులు సేవా కార్యక్రమాలు కొనసాగించడం ఆయన ప్రభావాన్ని, మానవతా స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. శతజయంతి ఉత్సవాలకు దేశాధ్యక్షులు, కేంద్ర–రాష్ట్ర మంత్రులు, పలువురు దేశాల ప్రతినిధులు హాజరుకావడం బాబా యొక్క మహత్తును మరోసారి తెలియజేస్తుందని వ్యాఖ్యానించారు.
- కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయి కుల్వంత్ హాలులోని సత్య సాయిబాబా మహాసమాధిని దర్శించుకున్నారు. సత్య సాయిబాబా ఆలోచనలను ప్రజలకు చేరవేయడంలో ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని సీఎం స్పష్టం చేశారు.
సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు
RELATED ARTICLES

