సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం //మన ప్రజా ప్రతినిధి
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం పరిధిలోని రామానగూడ గ్రామం సమీపంలో ఈరోజు మధ్యాహ్నం రాజీవ్ రహదారి పై తీవ్ర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న టిప్పర్ లారీ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ప్రమాద సమయంలో లారీ లో ఉన్న డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. ఢీకొట్టిన ప్రభావంతో ఇద్దరూ కేబిన్లో ఇరుక్కుపోయారు. స్థానికులు, అంబులెన్స్ సిబ్బంది సహాయంతో వారిని బయటకు తీసి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం క్షతగాత్రులను గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్లీనర్కి వచ్చిన గాయాలు కొద్దిగా తీవ్రమైనట్లు వైద్యులు తెలిపారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ను సవ్యంగా చేశారు. టిప్పర్ లారీ అధిక వేగం ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

