•జనవరి30నుంచిఫిబ్రవరి13వరకు అన్నిగ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు: డా.నిర్మలారెడ్డి
•అవగాహనతోనే కుష్టి వ్యాధికి శాశ్వత విముక్తి సాధ్యం
•ప్రజలతో ప్రతిజ్ఞ చేయించిన జిల్లా వైద్యాధికారి
–గాంధీ వర్ధంతి సందర్భంగా దుద్దెడలో వైద్యారోగ్యశాఖ అవగాహన కార్యక్రమం
మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.జనవరి31
భారత స్వాతంత్ర్య సంగ్రామ ధ్రువతార, జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని కొండపాక మండలంలోని దుద్దెడ గ్రామపంచాయతీ ప్రాంగణంలో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో కుష్టి (లేప్రసి) వ్యాధి నివారణపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా వైద్యాధికారి డాక్టర్ నిర్మలారెడ్డి మాట్లాడుతూ, “కుష్టి వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ చేయి చేయి కలుపుకోవాలి” అనే నినాదంతో ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అవగాహన పెరిగితేనే కుష్టి వ్యాధిని పూర్తిగా దూరం చేయవచ్చని తెలిపారు.జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో కుష్టి వ్యాధి నిర్మూలన లక్ష్యంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలునిర్వహిస్తున్నట్లు డాక్టర్ నిర్మలారెడ్డి వెల్లడించారు. వ్యాధి లక్షణాలను తొలిదశలోనే గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం అవుతుందని వివరించారు.కుష్టి వ్యాధి గురించి ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందని, ఇది శాపం కాదు, అంటువ్యాధి కూడా కాదని, సమయానికి చికిత్స తీసుకుంటే ఇతరుల కు వ్యాప్తి చెందదని స్పష్టంచేశారు. ప్రతి ఒక్కరూ భయం లేకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి శ్రీధర్, డీపీఓలు, దుద్దెడ గ్రామ సర్పంచ్ మిద్దెశివకుమార్, ఉప సర్పంచ్ పల్లె జానకి యాదగిరి, వార్డు సభ్యులు నవీద్, రాజు, ప్రవీణ్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

