•సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవంలో విద్యార్థులకు మార్గదర్శనం –సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచన
రాజన్నసిరిసిల్ల,ఫిబ్రవరి10(మనప్రజాప్రతినిధి):
విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రానున్న వార్షిక పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని చందుర్తి ఎస్ఐ జె. రమేష్ సూచించారు. మంగళవారం చందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ‘అంతర్జాతీయ సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం’ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ పరీక్షల సమయం అత్యంత కీలకమని, ఈ సమయంలో సమయాన్ని వృథా చేయకుండా ప్రతి నిమిషాన్ని చదువుకే కేటాయించాలని విద్యార్థులకు సూచించారు. ముఖ్యంగా సెల్ఫోన్లు, సోషల్ మీడియా వంటి వ్యాపకాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో కూడిన చదువు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఏకాగ్రతతో చదివినప్పుడే పాఠ్యాంశాలు బాగా గుర్తుంటాయని, ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని దిశానిర్దేశం చేశారు.అనంతరం ఈ ఏడాది థీమ్ “స్మార్ట్ టెక్, సేఫ్ ఛాయిసెస్” గురించి వివరించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాంకేతికతను జ్ఞాన సముపార్జన కోసం ఉపయోగించాలే తప్ప తప్పుదారి పట్టేందుకు వాడకూడదని హితవు పలికారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
కళాశాల ఐ/సి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఎస్ఐ ఇచ్చిన సూచనలను విద్యార్థులు పాటించి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది,అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
పరీక్షల సమయంలో ప్రణాళికాబద్ధంగా చదవాలి-చందుర్తి ఎస్ఐ జె.రమేష్
RELATED ARTICLES

