•ముగ్గురు నిందితుల అరెస్ట్..బంగారం,వెండి ఆభరణాలు స్వాధీనం
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.మే20
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి, బెజ్జంకి పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడిన ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు సీపీ రష్మీ పెరుమాల్ తెలిపారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రాత్రి సమయాల్లో తాళం వేసిన ఇండ్లు, ఇంటి బయట నిద్రిస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని నిందితులు వరుస దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి తొమ్మిది తులాల బంగారు ఆభరణాలు, 12 తులాల వెండి ఆభరణాలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ రోజు ఉదయం చెర్యాల మండల పరిధిలోని గుర్జకుంట స్టేజి వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నిందితుల కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలను ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రజలు రాత్రి వేళల్లో మహిళలను ఆరుబయట నిద్రించనివ్వకూడదని, బంగారు ఆభరణాలను లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీపీ కోరారు.

