బాధితులతో హరీశ్ రావు భేటీ
న్యాయ సహాయానికి లీగల్ సెల్
ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
సమస్య పరిష్కారానికి పోరాట హెచ్చరిక
హైదరాబాద్,ఆగస్టు20(మనప్రజాప్రతినిధి): 22ఏ నిషేధిత భూముల జాబితా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులతో తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను, ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బాధితుల ఆవేదనలను ఓపికగా విన్న హరీశ్ రావు వారికి పార్టీ పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో పలువురు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 22ఏ నిషేధిత జాబితా వల్ల ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ సమస్యతో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పార్టీ పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం న్యాయపరంగా, రాజకీయంగా అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు తెలంగాణ భవన్లో పది మంది న్యాయవాదులతో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ లీగల్ సెల్ ద్వారా ప్రతి కేసును పరిశీలించి అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలుగా తాము కూడా సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టర్లతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రజలు ఎవరూ మధ్యవర్తులకు కమీషన్లు చెల్లించవద్దని, తక్కువ ధరలకు ఆస్తులు విక్రయించుకోవద్దని సూచించారు. హూడా, హెచ్ఎమ్డీఏ అనుమతులు పొందిన లేఅవుట్లలో దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన భూములు, ఇళ్లను కూడా 22ఏ జాబితాలో చేర్చడం వెనుక పెద్ద అవకతవకలు ఉన్నాయని హరీశ్ రావు ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ఈ విషయంపై మంత్రులు, అధికారులు చేసిన వ్యాఖ్యలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. వేలాది ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చిన అంశంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
లక్షలాది మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేసిన ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని డిమాండ్g చేశారు. చిన్న చిన్న అంశాలపై విచారణలు చేపట్టే ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన తప్పును ప్రభుత్వం స్వయంగా సరిదిద్దుకుని ఆన్లైన్ రికార్డుల నుంచి 22ఏ ఆంక్షలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. బాధితులను కార్యాలయాల చుట్టూ తిప్పకుండా సమస్యను సత్వరమే పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే బాధితులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హరీశ్ రావు హెచ్చరించారు. అవసరమైతే ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి కూడా సిద్ధమవుతామని పేర్కొన్నారు. అక్రమంగా నిషేధిత జాబితాలో చేర్చిన భూములన్నింటినీ పునరుద్ధరించాలని, ఈ వ్యవహారానికి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
22ఏ భూములపై బీఆర్ఎస్ ఆగ్రహం
RELATED ARTICLES


