ఇన్స్టాంట్ లోన్ యాప్ల పేరుతో కొత్త మోసాలు పెరుగుదల
వ్యక్తిగత వివరాలు అడిగి సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్న ప్రజలు
అనుమానాస్పద లింకులు, APK ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని సూచన
24 నవంబర్ (మనప్రజాప్రతినిధి):
హైదరాబాద్
“5 నిమిషాల్లో లోన్ అందిస్తాం” అంటూ ప్రజలను మోసం చేసే సైబర్ నేరాలు తెలంగాణలో వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీసు శాఖ కీలక హెచ్చరికను జారీ చేసింది. లోన్ యాప్ల పేరుతో అక్రమ లింకులు పంపుతూ ప్రజల వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ అకౌంట్ సమాచారాన్ని దోచుకునే సంఘటనలు పెరుగుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇలాంటి యాప్లు ఇన్స్టాల్ చేయడం ద్వారా ఫోన్లోని వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, కాంటాక్టులు సైబర్ నేరగాళ్లకు వెళ్లి, తరువాత బెదిరింపుల ద్వారా డబ్బులు దోచే ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. డబ్బు ఇస్తామని నమ్మించి తరువాత వడ్డీ పేరుతో వేధింపులకు గురి చేయడం, కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మనోభావాలను దెబ్బతీయడం వంటి దుర్మార్గాలు కూడా వెలుగులోకి రావడంతో పోలీసులు కఠినమైన చర్యలు చేపట్టారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని APK ఫైళ్లను డౌన్లోడ్ చేయకూడదని, అనుమానాస్పద లింకులు, సందేశాలు వచ్చితే క్లిక్ చేయకుండా వెంటనే డిలీట్ చేయాల్సిందిగా సూచించారు. అవసరమైతే మాత్రమే అధికారిక బ్యాంక్ లేదా ధృవీకరణ ఉన్న NBFCల యాప్లను ఉపయోగించాలని, వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని ఈ మోసాలు జరుగుతున్నాయని, ఎవరైనా బారిన పడ్డట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్ లేదా స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలని తెలంగాణ పోలీసులు సూచించారు.
5 నిమిషాల్లో లోన్ అంటూ మోసం… తెలంగాణ పోలీసుల కీలక హెచ్చరిక
RELATED ARTICLES

