మన ప్రజాప్రతినిధి – మానకొండూర్, నవంబర్ 25
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి బీసీ హాస్టల్, అలాగే మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టళ్లలో తీవ్రమైన చలితో విద్యార్థులు ఇబ్బందులు పడుతుండటాన్ని గమనించిన ప్రస్తుత సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ సూచనలపై “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమం ద్వారా దుప్పట్లు పంపిణీ చేశారు. మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ముఖ్య అతిథిగా పాల్గొని దుప్పట్లను విద్యార్థులకు అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ—నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నెలలుగా దుప్పట్లు, ప్లేట్లు, గ్లాసులు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండి విద్యార్థుల సమస్యలను పట్టించుకోకపోవడం విచారకరమని విమర్శించారు.హాస్టళ్లలో విద్యార్థులు చల్లని నీటితో స్నానం చేయాల్సి వస్తోందనీ, అనేక చోట్ల నేలపైనే పడుకోవడం వల్ల పాముకాటుకు గురయ్యే ప్రమాదం పెరిగిందని పేర్కొన్నారు. స్థానిక శాసనసభ్యులు వెంటనే హాస్టళ్లను పరిశీలించి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు.తరువాత ఇల్లంతకుంట మండల కేంద్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలను పరామర్శించారు.కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పల్లె నరసింహారెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

